Header Top logo

Ravuri Bhardwaj Varthanthi on October 18 – రావూరి భరద్వాజ వర్థంతి

Ravuri Bhardwaj Varthanthi on October 18

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ అక్టోబర్ 18న రావూరి భరద్వాజ వర్థంతి

ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత రావూరి భరద్వాజ. ఆయన కన్నా ముందు ఈ అవార్డు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు, డాక్టర్ సి. నారాయణరెడ్డికి ఈ అవార్డు లభించింది. భరద్వాజ 2011లో త్రిపురనేని గోపీచంద్ పురస్కారాన్ని, 2009లో లోక్‌ నాయక్ పౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని, 2012లో జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు.

రావూరి భరద్వాజ (జూలై 5, 1927  – (అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరు తెచ్చు కున్నారు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మ కథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచిం చారు. ఈయన బాల సాహిత్యంలో కూడా విశేషకృషి సలిపారు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగ ణింప బడుతుంది. ఆయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడాయన. ఆడంబ రాలు లేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీద కుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువు కున్నారు. ఆ తరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించారు. చిన్న తనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించే వారు. అప్పుడే పల్లె ప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాత కాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించు కున్నారు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళారు.

రావూరి 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపం లోని మోగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించారు. 1946లో నెల్లూరులోని జమీన్‌ రైతు వారపత్రిక సంపాదక వర్గంలో చేరారు.1948లో దీనబంధు వారపత్రికకు బాధ్యులుగా ఉన్నారు. జ్యోతి,సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పని చేశారు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నారు.

ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశారు. రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి, రచనల గురించి సమగ్రమైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకల నాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు. భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడును 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశారు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశారు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసిన చెయ్యి అనిపించు కున్నారు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచం, జంకు లేకుండా జీవనోపాధికై ఆయన అనేక కథలు వ్రాశారు.

1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. నాలోని నీవు, అంతరంగిణి, ఒక ఏకాంతం, ఒకింత వేకువ కోసం వంటి కవితా సంకలనాలు రచించారు. భరద్వాజ రచించిన కౌముది, హిందీ, గుజరాతీ భాషల్లోకి అనువాద మైంది. ఆత్మగతం, బానుమతి, దూరపు కొండలు, జీవనాడి, మనోరత్నం, నీరు లేని నది, సశేషం, స్వప్న సీమలు, స్వర్ణ మంజరి వంటి 11 నాటకాలు రచించారు. బాల సాహిత్యానికి సంబంధించి 33 పుస్తకాలు రచించారు. పిల్లల కోసం ఏడు నవలలు రాశారు. విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది.

పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ప్రజ్ఞ అద్భుత మైనది.రావూరి భరద్వాజ పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రచనల్లో ముఖ్యమైనది, చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్ట మొదటి నవల పాకుడు రాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖర శర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకు ముందే రాసిన ‘పాలపుంత’ అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాల పాటు కృష్ణా పత్రికలో ధారా వాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవ రాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.

రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వ విద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం, 1991లో నాగార్జున విశ్వ విద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. 1980లో కళాప్రపూర్ణ – ఆంధ్ర విశ్వవిద్యాలయం,1983లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1985లో సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనకకు లభించింది. 1987లో  రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు,1987లో  తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు, 1997లో తెలుగు విశ్వ విద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం, 2007లో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు, 2008లో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం,  (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబరు 4 వ తేదీన ప్రకటించారు),  2011లో కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు లభించాయి. 2012లో  జ్ఞానపీఠ అవార్డు తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖమైన కృషికి దక్కింది.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల

9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking