Header Top logo

జడ్జికే లాయర్‌ షోకాజ్‌ నోటీసు

లాయర్.. ఔను.. అతను న్యాయశాస్త్రంను చదివి న్యాయం చేయడానికి కోర్టులో వాదిస్తాడు. అతని హద్దులు దాటి కోర్టులో మాట్లాడితే జడ్జీకి కోొపం వస్తే మందలిస్తాడు.. కానీ.. ఓ లాయర్ చేసిన పనికి క్షేమాపణ చెప్పక పోతే జైల్ కు పంపిస్తామని హెచ్చరించారు జడ్జీ.. ఇంతకు ఆ లాయర్ చేసిన తప్పు ఏమిటంటే..?

జడ్జికే లాయర్‌ షోకాజ్‌ నోటీసు

జడ్జికే లాయర్‌ షోకాజ్‌ నోటీసు
హైకోర్టులో అసాధారణ సంఘటన

న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు

క్షమాపణ చెప్పకపోతే జైలుకు పంపిస్తామని ధర్మాసనం హెచ్చరిక

కోర్టులో తన వాదనను  వినడం లేదని ఆరోపణ చేస్తూ ఓ న్యాయవాది సాక్షాత్తూ జడ్జీకే షోకాజ్‌ నోటీసు ఇచ్చిన సంఘటన సంచలనం సృష్టించింది. శుక్రవారం హైకోర్టులో ఈ సంఘటన జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు బాధ్యుడైన న్యాయవాది బి. బాలముకుంద్‌ రావుపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయించింది.

భేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే న్యాయవాద వృత్తి నుంచి డిబార్‌ చేయడంతోపాటు జైలుకు పంపిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ పి. మాధవీదేవి కోర్టులో బాలముకుంద్‌ రావు జడ్జిపైన, తోటి న్యాయవాదులపైన ఆగ్రహంగా అరిచారు. తాను చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని పేర్కొంటూ న్యాయమూర్తికి లిఖితపూర్వక నోటీసు ఇచ్చారు.

న్యాయవాది చర్యను తీవ్రంగా పరిగణించిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీల ధర్మాసనం అతడిపై క్రిమినల్‌ కంటెంప్ట్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఆ న్యాయవాది ఇప్పటికీ తప్పుచేసినట్లు అంగీకరించడంలేదని తెలిపారు తాను తప్పుచేయలేదనే ధోరణిలో వితండ వాదన చేస్తున్నారని చెప్పారు.

గతంలోనూ ఇలాంటి ప్రవర్తనతో కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ స్పందిస్తూ తాను ఎనిమిది హైకోర్టుల్లో పనిచేశానని, ఇలా జడ్జికి నోటీసు ఇవ్వడం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. దాదాపు 40 ఏళ్ల ప్టాక్టీస్‌ ఉందని చెబుతున్న ఆయన ఈ వయస్సులో ఇలా ప్రవర్తించడం గర్హనీయమని తెలిపారు.

అదుపు లేకుండా, ఓ రౌడీ తరహాలో ప్రవర్తించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. న్యాయవాదిపై ఆధారపడిన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఇంటికి వెళ్లి తన ప్రవర్తనపై సమీక్షించుకోవాలని.. తన తప్పును తెలుసుకోవాలని సూచించారు.

ఏడురోజుల్లో భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయడంతోపాటు న్యాయమూర్తికి ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking