Header Top logo

కేసిఆర్ కు ప్రాణభిక్ష పెట్టింది జర్నలిస్టులే…

ఔను ఇది అక్షరాల రాజకీయం.. గద్దె (సీఎం) పదవి కోసం న్యూస్ ఛానల్స్ అండ్ పేపర్స్ నోరు మూయించిన ఘనత పొలిటికల్ లీడరులకు ఉండొచ్చు. కానీ.. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో టీవీలతో… న్యూస్ పేపరులతో పనే లేకుండా పోయింది.

ఇగో.. ఖమ్మంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జర్నలిస్టులను అవమాన పరుస్తూ మాట్లాడిన తీరుపై సీనియర్ జర్నలిస్ట్ శ్యాంసుందర్ ఆకుల గారు NEW SENSE Special story రాశారు.

సోషల్  మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ స్టోరీ ఇదే..

  • యాటకర్ల మల్లేష్

—-      —–      ——-

NEW SENSE Special story

ఏమిటిది ముఖ్యమంత్రీ।।!

– శ్యాంసుందర్ ఆకుల,  సీనియర్ జర్నలిస్ట్       

తెలంగాణ ఉద్యమం ఒక మహోన్నత పోరాట స్ఫూర్తి..! సంఘటిత ఉద్యమ విజయానికి ప్రతీక..! అన్నివర్గాల, ప్రాంతాల ప్రజలు సంకల్ప దీక్షతో కదంతొక్కి సాధించుకున్న చారిత్రక విజయం..! ఈ విజయంలో ఎవరి వాటా ఎంత ? ఇపుడు ఇదే ప్రాధాన్యంశంగా కనబడుతోంది..!

తొలిదశ పోరాట స్పూర్తితో మలిదశ ఉద్యమానికి అడుగులు పడ్డాయి..!
రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్ధపడిన కేసీఆర్ కు అసలు తెలంగాణ అంటే ఏంటో అణువణువు అవగాహన కల్పించింది ఆచార్య జయశంకర్ సార్.

ఈ ప్రాంత వైశిష్టం.. ప్రజల జీవన విధానం భౌగోళిక స్వరూపం.. ప్రజల జీవన శైలి, పూర్వపు పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రం ఏరిపడిన తర్వాత వివక్షకు గురైన తీరు, ప్రకృతి వనరులు ఇలా అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగించింది, శాంతియుత ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమవుతుందని కూడా ఉద్బోదించింది మహానుభావులు జయశంకర్ సారే! కేసీఆర్ కు కొండంత అండగా నిలిచి ఉద్యమానికి వారు దిశా నిర్దేశం చేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, సర్వస్వము ధారపోసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచిన మరో పోరాట యోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ..!

మలి దశ ఉద్యమ వేదిక కోసం తన వంతుగా జలదృశ్యం లోని తన ఇంటినే ఇచ్చేసి కేసీఆర్ ఉద్యమానికి మరింత జవసత్వం కల్పించారు..! అలాంటి మహానుభావుల అండదండలతోనే కెసిఆర్ రాష్ట్ర సాధన పోరాటానికి బలంగా తొలి అడుగులు వేయగలిగారు..! తన వాగ్ధాటితో జనాకర్షక ప్రసంగాలతో కు ప్రజల్లో చైతన్యాన్ని తట్టి లేపడంలో కెసిఆర్ అంచనాలను మించి విజయం సాధించారు..! ఈ క్రమంలో కవులు కళాకారులు మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. వెన్నంటి నడుస్తూ ఉద్యమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు..

పదమూడేళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఉద్యమంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి! ఉద్యమ సంఘముగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కుట్రలు కుతంత్రాలను అధిగమిస్తూ పడుతూ లేస్తూ ఉద్యమం నిర్విరామంగా కొనసాగింది. అయితే ఎన్ని అడ్డంకులూ అణచివేతలు ఎదురైనా చివరివరకూ శాంతియుతంగానే ఉద్యమం కొనసాగింది..!

రాజకీయ ప్రతికూల పరిస్థితులవల్ల చాలా సందర్భాల్లో కెసిఆర్ కాస్త వెనక్కి తగ్గినప్పటికీ కవులూ కళాకారులూ జర్నలిస్టులు, ఉద్యోగులు న్యాయవాదులు, యువజన విద్యార్ధి సంఘాలు రైతులు ఉద్యమాన్ని బలంగానే ముందుకు తీస్కెళ్ళారు. రాజకీయ విబేధాల వల్ల ఉద్యమం నీరుగార వద్దనే లక్ష్యంతో ఐక్య కార్యాచరణ కమిటీ ని ఏర్పాటు చేసి ఆచార్య కోదండరాం నేతృత్వంలో చివరిదశ ఉద్యమం అత్యంత బలంగా కొనసాగుతూ వచ్చింది.

2009 లో హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ తేనె తెట్టును కదిపిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆతర్వాత కొద్దిరోజులకే హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు..! అప్పటికే ఫ్రీజోన్ అంశంతో రగిలిపోతున్న తెలంగాణ యువతకు కెసిఆర్ ఆమరణ దీక్ష మరింత ఊతం ఇచ్చింది.. ఉమ్మడి రాష్ట్రంలో ఉంటె ఇలాగే దగా పడతామని భావించిన ప్రజలు మరింత తెగువ చూపి ఉద్యమాన్ని ఉదృతం చేసారు. ఓ వైపు కెసిఆర్ వర్గం.. మరోవైపు జేఏసీ సంఘటితంగా పోరాటం చేసి వచ్చినట్లే వచ్చి చేజారిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని మొక్కవోని దీక్షతో తిరిగి సాధించుకున్నాయి..!

ఎందరో మహానుభావుల త్యాగఫలం తెలంగాణ..! మహోత్క్రుష్టమైన తెలంగాణ ఉద్యమం గురించి ఎంత చెప్పినా గోరంతే అనిపిస్తుంది! అదే నిజం కూడా..!

మలిదశ ఉద్యమంలో అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యం ఉంది! ఒక్క రాజకీయ నేతలు మినహా మిగిలిన అన్నివర్గాలు ఒక బలమైన ఆకాంక్షతో చేయిచేయి కలిపి ఉద్యమాన్ని నడిపించారు.. కానీ దురదృష్టమేంటంటే మొక్కుబడిగా నటించినవాళ్లు.. తెలంగాణ ను అడ్డుకోడానికి ప్రయత్నించిన వాళ్ళు.. ఉద్యమకారులని తరిమి కొట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు నేడు అధికారంలోఉండి రాజభోగాలు అనుభవిస్తుంటే..

ఉద్యమ పోరాటంలో లాఠీ దెబ్బలుతిని నొత్తురు చిందించిన వాళ్ళు ఇంకా అన్యాయానికి గురవుతూనే ఉన్నారు..! ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చడం లేదు..! ఒక్కో వర్గం గురించి.. ఎదురవుతున్న అన్యాయాల గురించి NEW SENSE ప్రత్యేకంగా కథనాలు వేయాలని నిర్ణయించింది.! ఇందులో భాగంగా ముందుగా జర్నలిస్టుల గురించి ప్రస్తావిస్తోంది..!

◻️◻️◻️◻️

మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు.

రాజకీయ పరిస్థితులవల్ల టీఅర్ఎస్ కెసిఆర్ బలహీనపడి ఉద్యమాన్ని నడిపించలేని స్థితిలో ఉన్న పలు సందర్భాల్లో ప్రజల్లో ఉద్యమవేడిని కొనసాగించడానికి జర్నలిస్టులు చేసిన నిర్విరామ కృషి అనితర సాధ్యమైనది.. ఈ క్రమంలో యాజమాన్యాల ఆగ్రహానికి గురై ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డునపడ్డప్పటికీ జర్నలిస్టులు తమ సంకల్పాన్ని వీడలేదు. భవిష్యత్ తరాల బాగుకోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడి తెగువ చూపారు..

ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో ముందుకు నడిచారు..! ఉద్యమ కార్యక్రమాలని కవర్ చేసే క్రమంలో లాఠీ దెబ్బలుతిని గాయపడిన ఉద్యమ జర్నలిస్టుల సంఖ్య రాష్ట్ర వ్యాపితంగా వేలల్లో ఉంటుంది.. పదుమూడేళ్ల సుదీర్ఘ పోరాటంలో జర్నలిస్టుల క్రియాశీలక పాత్ర వల్లే తెలంగాణ ఉద్యమాన్ని దేశం సహా ప్రపంచం గుర్తించింది..! జర్నలిస్టులు లేకపోతే ఉద్యమమే లేదు..! రాజకీయ స్వార్థం కుట్రల వల్ల మధ్యలోనే ఆగిపోయేదే..!

తెలంగాణను రాజకీయ కుట్ర తో అడ్డుకునే ప్రయత్నం జరిగినపుడల్లా ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన ఘనత ముమ్మాటికీ జర్నలిస్టులదే ..! చివరికి నిరాహార దీక్షకు ఉపక్రమించిన కెసిఆర్ ను అంతమొందించడానికి కుట్ర జరుగుతుందనే ప్రచారంతో పూర్తిగా అప్రమత్తమై ఖమ్మం వేదికగా జరిగిన ప్రయత్నాలకు పూర్తిగా అడ్డునిలిచి ఎదుర్కొన్నది కూడా జర్నలిస్టులే..!

2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణ ను అడ్డుకోడానికి శ్రీకృష్ణ కమిటీని తీసుకువచ్చి ఎలాంటి అడ్డంకులు కల్పిస్తున్నారో.. కమిటీ ప్రతినిధులను కొనుగోలు చేసి తప్పుడు నివేదిక ఇచ్చేలా ఎలాంటి కుట్రలు జరిగాయో ఎప్పటికప్పుడు ప్రజలకు పూసగుచ్చినట్లు వివరిస్తూ అప్రమత్తం చేసింది జర్నలిస్ట్ సమాజమే..!

నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్ ను ఖమ్మం హాస్పిటల్ కు తరలించినపుడు జర్నలిస్టులు లేకుండా ఉండిఉంటే పోలీసుల చెరలో ఉన్న అయన ప్రాణాలతో బయటకి వచ్చేవారే కాదని అప్పట్లో అందరు చెప్పేవారు. అటు ఖమ్మంలో ఇటు హైదరాబాద్ లో రాత్రంతా కొనసాగిన హైడ్రామాలో చివరికి నాటి మానవహక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ సుభాషిణ రెడ్డి చేత ఆదేశాలు జారీచేయించి ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు కెసిఆర్ ను సురక్షితంగా తరలించేలా కృషి చేసింది… ప్రతీ అంశాన్ని ప్రజలకి అనుక్షణం తెలియచేసింది కూడా జర్నలిస్టులే..! ఒక విదంగా కెసిఆర్ కు ప్రాణభిక్ష పెట్టింది జర్నలిస్టులే అని చెప్పవచ్చు..!

ఖమ్మం లో నాడు రాత్రంతా కొనసాగిన పరిణామాల్లో జర్నలిస్టుల పాత్ర ఏంటో ఒక్కసారి కెసిఆర్ హరీష్ రావు గుర్తు తెచ్చుకోవడం మంచిది..! దిక్కుతోచని స్థితిలో అర్థరాత్రి బషీర్ బాగ్ నగర పోలీస్ కార్యాలయం గేటువద్ద నిలబడి కెసిఆర్ కు ఏమవుతుందో అని ఏడ్చిన హరీష్ రావు.. నాడు జర్నలిస్టులు తనకు అండగా ఉండి దైర్యం నింపి హెచ్చార్సీ చైర్మన్ వద్దకి తీసుకునివెళ్ళిన విషయాన్ని మరిచిపోయి ఉంటారు! అధికార రాజభోగంలో ఇపుడు వాళ్ళకి జర్నలిస్టులు కంటికి కనిపించకుండా పోయారేమో..!

సకలజనులు సంఘటితంగా నడిచి సాధించుకున్న విజయాన్ని మొత్తంగా తన ఖాతా లో వేసుకున్న కెసిఆర్ అధికారంలోకి రాకముందు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రను ఆకాశానికెత్తి కీర్తించారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత పాతాళానికి పడేసారు.! సొంత రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతికేలా మెరుగైన జీవన వసతులు కల్పిస్తామని చెప్పి హీనాతి హీనంగా వ్యవహరించారు.

డబల్ బెదురూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి స్థలాల కేటాయింపు దాట వేశారు. వివాదాల్లో ఉన్న స్థలాలను చూపి రాజకీయం చేసారు. హెల్త్ కార్డులు అంటూ చెల్లుబాటుకాని కార్డులు ఇచ్చి దగా చేసారు.. మొత్తంగా హామీలన్నీ ఎదో ఒక సాకుతో దాటవేస్తూ మోసపూరిత వైఖరి ప్రదర్శించారు కెసిఆర్!

గత తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పదే పదే అవే హామీలను వల్లెవేస్తూ మోసం చేసిన తీరు పచ్చి ద్రోహం కిందే పరిగణించాల్సి ఉంటుంది. ఒకరిద్దరికి పీఆర్వో పోస్టులు ఓ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది జర్నలిస్టులకు న్యాయం చేసినట్లు అవుతుందా ?

నీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ద్రోహులకు అధికారంలో వాటా కల్పించి అందలమెక్కించి.. సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలకు తెగించి రక్తం చిందించి..నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ రక్షణగా నిలిచిన జర్నలిస్టులకు ద్రోహం చేస్తావా ?

అధికారంలో వాటా.. మెరుగైన జీవనం పొందడం జర్నలిస్టుల హక్కు .. నువ్వు ఇచ్చే వరం కాదు..! రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రగతి పథంలో నడవాలి అభివృద్ధి తెలంగాణ సాకారం కావాలనే లక్ష్యంతో కెసిఆర్ ప్రభుత్వానికి జర్నలిస్టులు సహకరిస్తూ వస్తున్నారు.. ఎన్ని అవమానాలు ఎదురైనా… హామీలను నెరవేర్చకుండా మోసం చేసినా సహనంతో సహకరిస్తూనే ఉన్నారు. ఇది చేతకాని తనంగా భావిస్తే కెసిఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..!

▫️ ఎందుకింత అహంభావం ?

ఏ ఖమ్మం గడ్డమీద తన ప్రాణాలకు రక్షణగా నిలిచారో అదే ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం. అదేదో వాళ్ళు అడగకూడనిది అడిగినట్లు.. ఈయనేదో తన ఆస్థి పంచుస్తున్నట్లు జిల్లా మంత్రి.. హరీష్ రావ్ అదేందో సూడండి..! అన్నట్లుగా కెసిఆర్ మాట్లాడిన తీరు ఆయనలోని అధికార అహంభావానికి అద్దం పట్టింది..! అంతకంటే ఆశ్చర్యమేంటంటే.. అసలు తనకు అదేం గుర్తులేనట్లుగా కెసిఆర్ ప్రదర్శనిచ్చిన నటన అభ్యన్తరకరమైనది..!

జర్నలిస్ట్ సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదు !

కెసిఆర్ గారు మేము అడిగితేనే మీరు స్పందిస్తారా? మీకు మీరుగా ఈ విషయంపై మాట్లాడరా ? మీరు ప్రెస్సుమీట్లు పబ్లిక్ మీటింగులు పెట్టిన ప్రతి సందర్భంలో జర్నలిస్టులు కనిపిస్తున్నారు కానీ వారి సమస్యలు… మీరు ఇచ్చిన హామీలు కనిపించడం లేదా ? రేపో మాపో ఎన్నికలకు వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. ఇంతకీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన ఉందా లేదా తేల్చాల్సిన సమయం వచ్చింది.. కూడా కూడా ఆచరణలేకుండా హామీలతో మభ్యపెట్టాలని చూస్తే జర్నలిస్ట్ సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదు !
▫️▫️▫️▫️
Shyamasundar Akula
NEW SENSE
9010746999

Leave A Reply

Your email address will not be published.

Breaking