• హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు
  • యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు
  • పాల్గొన్న శ్రీనివాసరావు, సీహెచ్ విద్యాసాగర్, కుటుంబ సభ్యులు
సాధారణంగా కొత్త వాహనాలను ప్రారంభించడానికి ముందు పూజలు చేయడం సర్వసాధారణ విషయమే. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిత్యం వాహన పూజలు జరుగుతుంటాయి. అయితే, తొలిసారి ఓ హెలికాప్టర్‌కు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. యాదాద్రి పెద్దగుట్టపై నిన్న ఈ హెలికాప్టర్‌కు పూజారులు పూజలు చేశారు. చాపర్ యజమాని బోయినపల్లి శ్రీనివాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావుతోపాటు వారి కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.