Header Top logo

25,8,11,12,15,42,44 వ డివిజన్ లలో -అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి

AP 39TV 08మార్చ్ 2021:

అధికారపార్టీ ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని పోలీసుల అండతో టీడీపీ అభ్యర్థుల్ని ఏజెంట్లను బెదిరిస్తున్నారని అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 25,8,11,12,15,42,44 వ డివిజన్ లలో అభ్యర్థులు బొమ్మినేని శివ,అనసూయమ్మ,నాగలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, సుభాష్ చంద్రబోస్, సంగా తేజస్విని, హిమబిందు లతో కలసి ఆయా డివిజన్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.టీడీపీ నాయకులు కార్యకర్తలు వీధివీధి తిరుగుతూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం,మద్యం ధరలు,ఇసుక కొరత, ఆస్తి పన్ను పెంపు తదితర అంశాలు ప్రజల్లో మార్పు తెచ్చాయని టీడీపీ అభ్యర్థులకు మంచి స్పందన వస్తోందన్నారు.ప్రస్తుత ఎన్నికల్లో జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అయితే క్రింది స్థాయి అధికారులు వైసీపీ అభ్యర్థులకు దాసోహమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను వారి ఎజెంట్లను స్టేషన్లకు పిలిపించుకుంటున్నారన్నారు. పోలీసుల ఏకపక్షధోరణి మారాలని ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు. అలా కానిపక్షంలో అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. టీడీపీ హయాంలో 5 సంవత్సరాలు నగరంలో రౌడీయిజం, గూండాయిజం లేకుండా చేశానన్నారు. సొంతపార్టీ వాళ్ళు ప్రజలకు కీడు తలపెట్టినా వారిని ఎదురించానన్నారు.ప్రస్తుత ఎన్నికల్లో మామాటే శాసనమని వైసీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థలో చేతనైతే ప్రజలని మెప్పించి ఒప్పించి ఓట్లు వేయించుకోవాలని వైసీపీ నేతలకు హితవుపలికారు. అధికారపార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను బెదిరిస్తే చరిత్ర క్షమించదన్నారు. ఏడాది నుండే ఏకగ్రీవాల కోసం టీడీపీ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.నగరపాలక సంస్థ ఎన్నికల్లో కోట్లు పెట్టుబడి పెట్టె వ్యాపారులకు,రౌడి షీటర్లకు అధికార పార్టీ అభ్యర్థులుగా నియమించిందన్నారు. ఇలాంటి వికృత చేష్టలతో అనంత ఎమ్మెల్యే లో దాగివున్న అపరిచితుడు బయటికోచ్చాడన్నారు.టీడీపీ అభ్యర్థులకు లక్షలు ఎరచూపుతున్నారని లొంగకపోతే పోలీసు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు.నగర ప్రజలు ఆలోచించాలని అరాచకం రాజ్యమేలితే నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోందని నియంతల్లా పరిపాలించిన హిట్లర్ లాంటి వాళ్ళు చరిత్ర హీనులై కాలాగర్భంలో కలిసిపోయారన్నారు.నగర ప్రజలు రౌడీలు, దోపిడీదారులకు ఓట్లు వేస్తే అభివృద్ధి అధోగతి పాలౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కోట్లు పెట్టుబడి పెట్టే వ్యాపారస్తులకు ఓటు వేస్తే నగరంలో ప్రైవేట్ సైన్యాలతో భూకబ్జాలు పెరుగుతాయన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓటు ద్వారా చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి టీడీపీ మిత్రపక్షాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking