Header Top logo

ఆంధ్రప్రదేశ్‌పై ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనం.. ఉచితాలకు కోత పెట్టకుంటే శ్రీలంక పరిస్థితేనని హెచ్చరిక!

  • కరోనా కంటే రెండేళ్ల ముందు నుంచే దిగజారిన పరిస్థితులు
  • మేలుకోకుంటే మరింత దారుణ పరిస్థితులు
  • సొంత ఆదాయం తగ్గిపోవడంతో అప్పులపైనే బతుకీడుస్తున్నాయి
  • మిగతా రాష్ట్రాల కంటే పంజాబ్ పరిస్థితి మరింత దారుణం
  • ఏపీ సంక్షోభం అంచున ఉందన్న మాజీ సీఎస్ ఎల్వీ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో అప్పుల కుప్పలు పెరిగిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికైనా మేలుకోవాలని, లేదంటే పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాసుకొచ్చింది. నిజానికి కరోనా కంటే రెండేళ్ల ముందు నుంచే అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారడం మొదలైందని పేర్కొంది. 
తమ సొంత ఆదాయం తగ్గిపోవడంతో రాష్ట్రాలు అప్పులపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ సెంటర్ డిస్కం ఎస్యూరెన్స్ యోజన కూడా ఈ పరిస్థితులకు మరో కారణమని వివరించింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని ఇతర అంశాలు కూడా వాటి ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమయ్యాయని తెలిపింది. నిజానికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదలే ఎక్కువగా ఉందని ‘కాగ్’ నివేదికలు కూడా చెబుతున్నాయి. ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాలు వాటిని తీర్చలేకపోతున్నాయని తెలిపింది.

ఇటీవల ఎన్నికలు జరిగిన పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రకటించారని, ప్రస్తుత అప్పులకు అవికూడా తోడైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని పేర్కొంది. పంజాబ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని, గత నాలుగేళ్లలో పంజాబ్ రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల రేటు 9 శాతంగా ఉంటే వడ్డీ చెల్లింపు రేటు 3 శాతం పెరిగిందని, జీఎస్‌డీపీలో 53 శాతం అప్పులు చేసిన పంజాబ్ పరిస్థితి దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే దారుణంగా ఉందని రాసుకొచ్చింది.

యూపీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంటే, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అప్పులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పు రూ. 3.89 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ. 40 వేల కోట్లు ఎక్కువ. ఏపీ జీఎస్‌డీపీలో అప్పు 32.4 శాతానికి చేరుకుంది. ఏపీకి ఉన్న మొత్తం చెల్లింపుల భారం రూ.7.76 లక్షల కోట్లు కూడా లెక్కల్లోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో మన భారాల వాటా 76 శాతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే పంజాబ్ కంటే ఏపీలోనే పరిస్థితులు దారుణంగా ఉన్నట్టు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులపై కనుక కేంద్రం ఆంక్షలు విధిస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకమైంది. అలాగే, మూడు సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, ప్రభుత్వ ఉద్యోగులకూ పెద్ద మొత్తంలో బకాయిలు పడింది. అయితే, ఈ భారం ఎంత అనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక, ఏపీ ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సంక్షోభం అంచున ఉందని పేర్కొన్నారు. మరోవైపు, ఆర్థిక నిపుణులు కూడా ఏపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ది ప్రింట్’ తన కథనంలో అధికారిక లెక్కలనే పరిగణనలోకి తీసుకుందని, నిజానికి రాష్ట్రంలో అంతకుమించిన దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking